కలం, నిర్మల్ : ఆశా వర్కర్ల (ASHA workers) సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (Telangana ASHA Workers Union) ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఆందోళన (Protest) చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ (Suresh) మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తే ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
రూ.18 వేల వేతన హామీ అమలు చేయాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల కనీస వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోగా, ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తున్నట్టు తెలంగాణలోనూ ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించి, ప్రభుత్వం తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

