కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి సబ్ రిజిస్ట్రార్ను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేస్తున్నారని ఓ బాధితుడు గత నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రిజిస్ట్రేషన్ కోసం రూ.90 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్గా రూ.50 వేలు చెల్లించారు.
మిగిలిన మొత్తాన్ని మంగళవారం నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందజేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మధ్యవర్తి నాగరాజు (నగేష్) ద్వారా సబ్ రిజిస్ట్రార్ డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేయడం నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీని సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

