కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తనను ఉద్దేశించిన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్న స్పీకర్ ఈ రోజు సభకు దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు మీడియాతో స్పీకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సోమవారం జరిగిన ఘటనతో నేను ఆవేదనలో ఉన్నా. జరిగినదానికి హరీశ్ రావు పార్టీ తరఫున క్షమాపణలు చెబుతారని ఆశించాను. కానీ డైవర్షన్ చేసేందుకు ప్రయత్నించారు. అందుకే కోపం వచ్చింది’ అన్నారు.
స్పీకర్ మాట్లాడుతూ.. ‘మహిళా ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను కొడుతున్న వీడియోలు కూడా నా వద్దకు వచ్చాయి. సస్పెండ్ చేసి పంపించే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ విధానం అలా ఉండదు. నేను ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. ఈ రోజు సభకు దూరంగా ఉంటున్నా. ప్యానెల్ స్పీకర్గా కడియం శ్రీహరిని నియమిస్తున్నా. ఆయన సభ నడిపిస్తారు’ అని స్పీకర్ తెలిపారు.
ఓదార్చిన సీఎం, డిప్యూటీ సీఎం..
అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని ఆయన ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓదార్చారు. స్పీకర్ కన్నీరు పెట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తాతా మధును ఇప్పటికే నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

