కలం, వెబ్ డెస్క్: భర్త ఫోన్ ఎత్తలేదనే మనస్తాపంతో భార్య ఆత్యహత్య చేసుకున్న విషాదకర ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న ఓ నిర్ణయం ఆమె కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల (20)కు మహబూబాబాద్లోని హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ బాణోత్ హుస్సేన్తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది.
అయితే కొన్ని రోజుల క్రితం అఖిల పాపను తీసుకుని తన పుట్టింటికి వెళ్లింది. పాప ఏడుస్తుండటంతో భర్తకు చూపించి మాట్లాడించేందుకు ఈనెల 2వ తేదీన అఖిల హుస్సేన్కు వీడియో కాల్ చేసింది. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అఖిల వెంటనే మహబూబాబాద్లోని తన అత్తగారింటికి వెళ్లింది. క్షణికావేశంలో ఎలుకల మందు తిని ఆత్యహత్యకు (Woman Suicide) పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున అఖిల మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

