కలం, నిర్మల్ : ఖానాపూర్ నియోజకవర్గంలోని కేస్లాగూడ గ్రామంలో (Keslaguda Village) గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) పాల్గొన్నారు. గ్రామానికి చెందిన కోడి గంగన్న నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే.. నూతన గృహాన్ని సందర్శించి గంగన్న కుటుంబ సభ్యులను అభినందించారు.
అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన డిజిటల్ రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

