కలం, నిర్మల్: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని బుధవారం ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజల జీవితాలలో చెరగని ముద్ర వేశాయని అన్నారు.
ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, వారికి అండగా నిలిచిన నాయకుడిగా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. పేదలు, రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజా సంక్షేమానికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

