కలం, ఖమ్మం బ్యూరో: పండుగ వేళ రాఖీ కట్టించుకుందామని స్వగ్రామానికి వచ్చాడు తమ్ముడు. గ్యాంగ్ వార్ కారణంగా తన తమ్ముడు చనిపోవడంతో ఓ అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ హృదయవిదారక సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో (Manuguru) దిగ్భ్రాంతిని రేపింది. హైదరాబాద్లో నివసిస్తున్న సింహాద్రి శివకుమార్ (శివ) రక్షాబంధన్ వేడుకల కోసం గురువారం ఉదయం మణుగూరులోని స్వగ్రామానికి చేరుకున్నాడు. స్థానికంగా జరిగిన గ్యాంగ్ ఘర్షణలో ప్రత్యర్థుల దాడికి బలైపోయాడు. గాయాలపాలైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ప్రాణాలు కాపాడలేకపోయారు.
పాడెపైనే రాఖీ!
పాడేపై అచేతనంగా ఉన్న తమ్ముడి చేతికి రాఖీ కడుతూ కన్నీటి వీడ్కోలు పలికింది అక్క. కాగా శివకు కొద్ది రోజుల కిందటే ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వివాహం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబం విషాదంలో మునిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజున విషాద ఘటన చోటుచేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

