కలం, నిర్మల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని(Chalo Delhi Protest) విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్. విలాస్ పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని సిపిఐ (CPI) కార్యాలయంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. విలాస్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్, ఎస్.ఎన్.రెడ్డి, పి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

