భద్రాచలం పోలీసుల ‘సర్జికల్ స్ట్రైక్’.. 262 ఇళ్లలో తనిఖీలు

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam Police) పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో బుధవారం పోలీసులు ఒక్కసారిగా ‘సర్జికల్ స్ట్రైక్’ తరహాలో మెరుపు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్ ప ర్యవేక్షణలో చేపట్టిన ఈ ‘కార్డాన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్‌లో కాలనీలోని 262 ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. భారీ ఎత్తున పాల్గొన్న పోలీస్ సిబ్బందితో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు, డాగ్ స్క్వాడ్ కాలనీని అంగుళం అంగుళం తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని, పెండింగ్ చలాన్లు ఉన్న 82 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడికక్కడే పెండింగ్ చలాన్లను వసూలు చేయడంతో పాటు సరైన నంబర్ ప్లేట్లు లేని, ట్యాంపరింగ్‌కు గురైన వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

​తనిఖీల అనంతరం డీఎస్పీ అరుణ్ కుమార్ కాలనీవాసులతో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను సక్రమంగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్లను ట్యాంపర్ చేయడం లేదా నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

​ముఖ్యంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై దృష్టి సారించిన డిఎస్పి, గంజాయి వినియోగం, విక్రయాలు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఒకవేళ గంజాయికి బానిసలైన వ్యక్తులు ఉంటే వారి వివరాలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే, వారిపై కేసులు పెట్టకుండా డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో భద్రాచలం సీఐ నాగరాజు, ఎస్‌ఐలు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>