కలం, వెబ్ డెస్క్: కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రూ.500 కోసం కుమారుడే ఈ దారుణానికి పాల్పడటం చూసి అంతా షాకవుతున్నారు. జహీరాబాద్ (Zaheerabad) మండలం అల్లీపూర్ గ్రామంలో శంకర్ అనే వ్యక్తి చెప్పులు కుట్టుకునే దుకాణం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వారి స్వస్థలం కర్ణాటక కాగా.. రెండు నెలల కిందటే కుటుంబంతో సహా అల్లీపూర్కి వచ్చి ఉంటున్నారు.
తీయలేదని ఎంత చెప్పినా…
బుధవారం రాత్రి శంకర్ కుమారుడు తుకారాం (35) తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 కనిపించడం లేదని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తాను తీయలేదని శంకర్ ఎంత చెప్పినా.. వినిపించుకోలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తుకారాం కత్తితో శంకర్పై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో.. వెంటనే ఘటనా స్థలానికి వచ్చి తుకారాంను అదుపులోకి తీసుకున్నారు.

