కలం, వెబ్డెస్క్: వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ అనహత్ సింగ్ (Anahat Singh) తన తదుపరి పెద్ద లక్ష్యంపై దృష్టి సారించింది. వచ్చే నెలలో జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్లో సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఆమె సిద్ధమవుతోంది. గతంలో 2023 చైనా ఏషియన్ గేమ్స్లో అనహత్ మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. ఈసారి ఆ పతకాల రంగును ఖచ్చితంగా మార్చాలని, స్వర్ణం సాధించడమే తన ఆశయమని ఆమె స్పష్టం చేసింది. దీనికోసం వచ్చే నెల రోజుల పాటు తీవ్రంగా శిక్షణ పొందుతానని వెల్లడించింది.
ఇటీవల వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో అనహత్ పసిడి పతకం గెలుచుకుంది. ఈ విజయం వల్ల తన జీవితంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఆమె తెలిపింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో సీనియర్ స్థాయిలో మెరుగైన నైపుణ్యాలు ప్రదర్శించేందుకు శ్రమిస్తున్నట్లు పేర్కొంది. తన తక్షణ లక్ష్యం ఏషియన్ గేమ్స్లో రాణించడమే అయినప్పటికీ, భారత్ తరఫున ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని 18 ఏళ్ల అనహత్ స్పష్టం చేసింది.
ప్రతీ టోర్నీ, ప్రతీ ప్రాక్టీస్ సెషన్ ఒలింపిక్స్ వైపే సాగుతాయని ఆమె నొక్కి చెప్పింది. అనహత్ మొదట ఐదేళ్ల వయసులో పి.వి. సింధును చూసి ప్రేరణ పొంది బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల వయసులో అక్కను చూసి స్క్వాష్లోకి అడుగుపెట్టింది. స్క్వాష్లో జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషాల్లను స్పూర్తిగా తీసుకుంటూ అగ్ర స్థాయికి చేరింది.

