కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై కొండగట్టు ఆలయానికి వెళ్లే మార్గంలో వేగంగా వస్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది ప్రయాణికులు గాయపడగా.. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమందికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
108 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయిదుగురిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించే అవకాశాలున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన కారణంగా ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోగా పోలీసులు క్లియర్ చేస్తున్నారు.

