కలం, కరీంనగర్ బ్యూరో: కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన సోమవారం జమ్మికుంట (Jammikunta) లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గుల్లి సంపత్ అనే వ్యక్తి స్థానిక రైల్వే ట్రాక్పై రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.
ఘటనా స్థలంలో ఆయన రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. గత ఆరు సంవత్సరాలుగా తన తమ్ముడు రవితో పాటు తల్లిదండ్రులు తనను తీవ్రంగా మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని సంపత్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు రవి తక్షణమే ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలని, తన ఇంటిని తన పిల్లలకే చెందేలా చూడాలని న్యాయవాదిని, పెద్దలను కోరారు.
తన పిల్లలను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంటూ, బంధుమిత్రులు, వార్డు ప్రజలు తనను క్షమించాలని లేఖలో రాసుకొచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

