కలం, మహబూబ్నగర్ బ్యూరో: క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచుతాయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భండారి శాంతి కుమార్ (Bhandari Shanthi Kumar) అన్నారు. పాలమూరు బండమీదిపల్లిలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంత స్థాయి ఖేల్ ఖూద్–2026 క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన భండారి శాంతికుమార్ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసంలో అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు.
గెలుపు ఒక్కటే కాదు..
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సమష్టి భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని శాంతికుమార్ అన్నారు. గెలుపు ఒక్కటే క్రీడల లక్ష్యం కాదు. ఓటమిని స్వీకరించి మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించే సంకల్పాన్ని క్రీడలు నేర్పుతాయన్నారు. మైదానంలో అలవడే క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్ జీవితానికి బలమైన పునాది అవుతుందని శాంతికుమార్ పేర్కొన్నారు. విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, సేవాభావం, శారీరక దృఢత్వంతో కూడిన భావితరాన్ని తీర్చిదిద్దడంలో సరస్వతీ విద్యాపీఠం, శిశుమందిర్ విద్యాసంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు. చదువులో ప్రతిభ, మైదానంలో పోరాటస్ఫూర్తి, హృదయంలో దేశభక్తి.. ఇదే భావితరానికి కావాల్సిన శక్తి అని శాంతికుమార్ పేర్కొన్నారు.

