కలం, వరంగల్ బ్యూరో : సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రసిద్ధిగాంచిన మేడారం మరోసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పర్యటనకు వేదిక కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మూడోసారి మేడారానికి రానున్నారు. జాతరకు ముందు ఇప్పటికే రెండుసార్లు మేడారంలో పర్యటించిన సీఎం.. ఈసారి కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
గత జాతరకు ముందు రెండుసార్లు మేడారానికి వచ్చిన రేవంత్రెడ్డి.. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.250 కోట్ల నిధులు కేటాయించారు. అనంతరం రెండోసారి మేడారానికి వచ్చిన సందర్భంగా ఇక్కడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం మూడోసారి మేడారం పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పనుల పురోగతి, భక్తులకు అందాల్సిన సౌకర్యాలు, జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షించే అవకాశం ఉంది. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై అధికార యంత్రాంగం, స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.

