కలం, నిర్మల్: రాష్ట్రంలో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే భూ కుంభకోణాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నలుగురు మంత్రులు, నలుగురు కాంట్రాక్టర్ల చేతిలో నలిగిపోతోందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి భూ కుంభకోణాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో ఉన్న భూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిగా (Bhu Bharati) మార్చి భూ దందాలకు పాల్పడుతోందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో భూభారతిలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ అవినీతిని ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అటవీ, దేవాదాయ శాఖలకు చెందిన లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. భూభారతిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించినప్పటికీ.. ఆ నివేదికను ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదని నిలదీశారు. భూభారతి రైతులకు భారంగా మారిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టా భూములను 22-ఏ జాబితాలో ఎందుకు చేర్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ వ్యవహారాలలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.

