కలం, కరీంనగర్: నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న నారాయణపూర్ గ్రామాన్ని (Narayanapur) అధికారికంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) డిమాండ్ చేశారు. రిజర్వాయర్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వంటి కారణాలతో గ్రామ ప్రజలు తమ భూములు, ఇళ్లు, వ్యవసాయ జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన అధికారిక ప్రకటన చేసి బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాల్సి ఉండేనని చెప్పారు. నారాయణపూర్ గ్రామంలో ముంపు పరిధిలోకి వచ్చే ప్రతి ఎకరం భూమిని శాస్త్రీయంగా సర్వే చేసి నమోదు చేయాలని చెప్పారు.
భూములు, ఇళ్లు, చెట్లు, బోర్లు, పంటలు తదితరవాటికి ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని హరిప్రసాద్ కోరారు. అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి పునరావాసం పునరావాస ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. గ్రామ ప్రజలతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి, ముంపు, పరిహారం, పునరావాసంపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని చెప్పారు. నిర్వాసితుల పిల్లల విద్య, ఉపాధి, తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. ముంపు కారణంగా జీవనోపాధి కోల్పోయే రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు మరియు ఇతర వర్గాలకు ప్రత్యేక పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి పేరుతో ప్రజలు నష్టపోవడం కాదని.. ప్రజల హక్కులను కాపాడుతూ అభివృద్ధి జరగాలి అనేది తమ స్పష్టమైన డిమాండ్ అని చెప్పారు. నారాయణపూర్ గ్రామ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం తక్షణమే అధికారికంగా ముంపు సర్వే నిర్వహించి, గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించడంతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, కొత్తపల్లి తిరుపతి, చంటి శ్రీనివాస్, బుడిగె పర్షారం గౌడ్, జంగ అపర్ణ, లింగంపల్లి మల్లేష్, రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, మ్యాక మారుతి తదితరులు పాల్గొన్నారు.

