కలం, స్పోర్ట్స్ : అమెరికాలోని ఒరెగాన్లో జరుగుతున్న ప్రపంచ యు20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (World U20 Athletics Championships)లో భారత్ అదరగొట్టింది. నాలుగో రోజు శనివారం జరిగిన పోటీల్లో భారత జంపర్లు రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. హైజంప్లో బసంత్ వెండి పతకం సాధించారు. ఈ పోటీల్లో భారత్కు హైజంప్లో పతకం రావడం ఇదే తొలిసారి. ఆయన తన వ్యక్తిగత ఉత్తమ రికార్డు 2.21 మీటర్ల మార్కును అందుకని రెండో స్థానంలో నిలిచారు.
అల్జీరియాకు చెందిన యూనిస్ అయాచి స్వర్ణం గెలుచుకున్నారు. మరోవైపు లాంగ్ జంప్లో షానవాజ్ ఖాన్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో లాంగ్ జంప్లో పతకం గెలిచిన తొలి భారత పురుష అథ్లెట్గా ఆయన నిలిచారు. తన మూడో ప్రయత్నంలో 7.84 మీటర్లు దూకి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం జావెలెన్ త్రోలో ఆశిష్ యాదవ్ సాధించిన వెండి పతకంతో కలిపి, భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.
ఇందులో రెండు వెండి, ఒక కాంస్యం ఉన్నాయి. మరోవైపు మహిళల 4×400 మీటర్ల రిలే టీమ్ ఫైనల్కు అర్హత సాధించింది. భూమిక, తహురా, తను, థియా బృందం 3:39.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్-1లో మూడో స్థానంలో నిలిచింది. తను మూడో లెగ్లో వేగంగా పరిగెత్తి జట్టును టాప్-3కి తీసుకొచ్చింది. రేస్ వాకింగ్ ఫైనల్లో ఆసియా మాజీ రికార్డు హోల్డర్ 19:32.30 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నారు.

