కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై ఏపీ ఉద్యోగ జేఏసీ (AP Employees JAC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్వేత పత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
జూలై 22న జరిగిన సమావేశంలో సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 98 శాతం ఉద్యోగులకే వెళ్తుందని శ్వేతపత్రంలో పేర్కొనడంపై బొప్పరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర మొత్తం ఖర్చులో ఉద్యోగుల జీతాల వాటా 37 శాతమే ఉందన్నారు. మరి ఉద్యోగుల ఖర్చు 98 శాతంగా ఎలా చూపించారని ప్రశ్నించారు.
అలాగే రిటైర్మెంట్లతో ఏటా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 13,624 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని, పని భారం, ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వల్ల ఖర్చు పెరిగినట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని తెలిపారు.
పీఆర్సీ కమిషన్ను ఎందుకు నియమించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు రూపాయి బిల్లు పెట్టినా చెల్లింపులు జరుగుతున్నాయని, తమకు రావాల్సిన పీఆర్సీ, డీఏల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. తమతో జరిగిన చర్చలపై ఈనెల 15లోపు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read : పాము పడగ కింద వైసీపీ కార్యకర్తలు.. మంత్రి సవిత హెచ్చరిక
Follow Us On : WhatsApp

