కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట ఖజానాకు జీఎస్టీ రాబడులను (GST Revenue) పెంచుకోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తోడ్పడుతుందని ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణ్యన్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, జీఎస్టీ, ఎక్సయిజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ఇరువురు చర్చించారు. జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో ప్రక్రియను సులభతరం చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు సీఎం పేర్కొన్నారు.
భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రికి అరవింద్ సుబ్రమణ్యన్ వివరించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

