కలం మెదక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హిందూ సంస్కృతిని అగౌరవపరుస్తూ, పవిత్ర ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (Chinta Prabhakar) మండిపడ్డారు. అర్చకుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. క్షుద్ర పూజల చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, గతంలో వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామితో పూజలు చేయించి, సీబీఐ విచారణను ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. వర్షాల కోసం యాగాలు, యజ్ఞాలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.
గుడులకు వెళ్లడం, పూజలు చేయడం తప్పు అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. హరీశ్ రావుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలన్నారు. లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు.

