కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్యాల (Malyala) మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్యాల ఒడ్డెర కాలనీ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం నీటి కుంటలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మల్యాలలోని ఎస్సి హాస్టల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు ఎస్టీ హాస్టల్ వెనుక ఉన్న కుంట వద్ద ఈతకు వెళ్లి గల్లంతయ్యారు.
స్థానికులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మృతుల్లో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి వాసం విష్ణు (11), జగిత్యాల టీఆర్ నగర్కు చెందిన 4వ తరగతి విద్యార్థి శుశాంత్ (10) గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ మల్యాల ఒడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ పరిసరాల్లో భద్రతా చర్యలు సరిగా లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన విద్యార్థుల మృతదేహలను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చూశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, విద్యార్థులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

