కలం, స్పోర్ట్స్ : భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. ఇటీవలి కాలంలో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న ఆయన, దేశవాళీ క్రికెట్లో ఊచకోత కోశారు. పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నీలో మైమరిపించే ద్విశతకంతో చెలరేగారు. అమృత్సర్ జట్టు తరఫున బరిలోకి దిగిన అభిషేక్, తరణ్ తారన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 91 బంతుల్లోనే 233 పరుగులు సాధించారు. ఇందులో 15 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నాయి. ఆయన స్ట్రైక్ రేట్ 256.04గా నమోదైంది. ఈ మెరుపు ఇన్నింగ్స్తో అమృత్సర్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోరు సాధించింది.
గత కొన్ని నెలలుగా అభిషేక్ అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. జింబాబ్వే సిరీస్లో మూడు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 11 పరుగులే చేశారు. అంతకుముందు ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టీ20 ప్రపంచకప్లోనూ ఎనిమిది ఇన్నింగ్స్లలో ఒక్క అర్ధశతకానికే పరిమితమయ్యారు. దీంతో భారత జట్టులో ఆయన స్థానంపై తీవ్ర చర్చ నడిచింది.

