కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంగ్టిలో జోగు సంగీత అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసు విషయమై ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ ఆదివారం దెగులువాడి గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, న్యాయం కోసం వెళ్తే తమను భయభ్రాంతులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
జోగు సంగీత భర్త జోగు విజయ్ మే 27న ఆమె కనిపించడం లేదని కంగ్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించలేదన్నారు. అనంతరం మే 29న గ్రామ శివారులో జోగు సంగీత (26) మృతదేహం ఎడమ చేయి లేకుండా లభించిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ, ఆ నివేదికను అందించలేదని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
రెండు నెలలు గడిచినా కేసులో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిద్ధార్థ అన్నారు. బాధిత కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే వారిని భయపెట్టడం బాధాకరమన్నారు. చట్టం అందరికీ సమానమని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ సంస్థ తరఫున పోరాటం కొనసాగిస్తామని సిద్ధార్థ స్పష్టం చేశారు.

