కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలోని కిసాన్ నగర్, శ్రీపురం కాలనీ, చింతకుంట, హనుమాన్ నగర్ ప్రాంతాలలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు (Bonalu Celebrations) ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఆయా దేవాలయాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు ఏపీపీ చంద్ర, సోమిడి వేణు, గాదె రూప, విప్పల సాయి జ్యోతి, గాజ రమ శివరాం, బారి అపర్ణ జితేందర్, ప్రజాప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

