కలం, వెబ్ డెస్క్ : లష్కర్ బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను గతంలో ఎవరూ పట్టించుకోలేదని, కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి సముచిత గౌరవం కల్పించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికతకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి రూ.1800 కోట్ల భారీ నిధులు కేటాయించి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా, అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా పునర్నిర్మించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం యాదాద్రి మాత్రమే కాకుండా, హైదరాబాద్లోని ప్రతీ దేవాలయానికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ ఉజ్జయిని మహంకాళి తల్లిని ప్రార్థించినట్లు కేటీఆర్ (KTR) తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, అన్నదాతలైన రైతులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని అమ్మవారిని వేడుకున్నామని చెప్పారు.

