కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ శివారులో మంజీరా (Manjeera) నదిపై రూ.32 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ ఉప్పొంగుతుంది. ఈ చెక్ డ్యాం పూర్తయి నెల రోజులే అయ్యింది. ఈ వ్యవధిలోనే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీరు చేరి ఆ చెక్ డ్యాం పొంగిపొర్లడంతో రైతులు స్థానికుల్లో ఆనందం వెల్లివిసిరింది. స్థానిక నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ఆ చెక్ డ్యాంను సందర్శించారు.
అనంతరం బ్రిడ్జి పైనుండి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంజీరా నదిలో పూలు చల్లి మొక్కారు. పోచారం దూరదృష్టితో మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ పొంగిపోర్లడంతో పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

