కలం, నిర్మల్: ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ మధ్య ప్రతిపాదిత కొత్త రైల్వే మార్గానికి అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) నాయకత్వంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బృందంలో ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, గోడం నగేష్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
రైల్వే లైన్ ప్రాధాన్యతను ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ రైల్వే మార్గం ఏర్పాటుతో ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు తక్షణమే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఏలేటి తెలిపారు.

