కలం, వెబ్డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఓ మాజీ డ్రైవర్ ఇంట్లో భారీ ఎత్తున నగదు లభ్యమవడం సంచలనంగా మారింది. సాధారణ జీవితం గడిపే సదరు వ్యక్తి ఇంట్లో నోట్ల కట్టలతో ఉన్న బ్యాగులు, భారీ ఎత్తున బంగారం దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇసుక మాఫియా (Sand Mafia) పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో బీర్భూమ్ జిల్లాకు చెందిన ఇసుక మాఫియా నాయకుడు తులు మీనార్ మండల్ అలియాస్ మహ్మద్ నజీబుద్దీన్ స్థావరాలపై ఇటీవల దాడులు నిర్వహించారు. అక్కడున్న డబ్బు చూసి పోలీసులే షాకయ్యారు. పదుల సంఖ్యల్లో పెద్ద పెద్ద బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారు బిస్కట్లను గుర్తించారు.
వెంటనే పోలీసులు ఐదు కౌంటింగ్ మిషన్లు తీసుకొచ్చి డబ్బును లెక్కించడం ప్రారంభించారు. మొత్తం డబ్బు లెక్కంచకుండానే మిషన్లు మొరాయించడం మొదలైంది. ఇప్పటి వరకు సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీని గురించి నజీబుద్దీన్ను విచారించగా ఆ డబ్బు, బంగారం మొత్తం తన అక్రమ సిండికేట్కు సంబంధించినవే అని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఆయనకు అక్రమ రాతి గనులు, క్రషింగ్ యూనిట్లతో కూడా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నజీబుద్దీన్ మాజీ టీఎంసీ నేతకు సన్నిహితుడిగా కూడా గుర్తింపు పొందాడు. ఇటీవల పలు రాజకీయ పరిణామాల అనంతరం టీఎంసీలో చీలిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రితబ్రత బెనర్జి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరిన అనుబ్రత మండల్తో ఆయనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అసలు నజీబుద్దీన్ ఇంత డబ్బు ఎలా కూడబెట్టాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. అవినీతిపై తమ ప్రభుత్వం జీరో టోలరెన్స్ విధానం అవలంబిస్తోందని, ఈ అక్రమ సంపాదన వెనుక ఉన్న ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీర్బూమ్ జిల్లా పోలీసులను సీఎం అభినందించారు.
Read Also: బొగ్గు మాఫియాపై ఈడీ పంజా.. 600 కోట్ల ఆస్తులు సీజ్!
Follow Us On: X(Twitter)

