కలం, వెబ్ డెస్క్ : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ కడెం జలాశయానికి (Kadem Project) భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టు ప్రస్తుతం కళకళలాడుతూ నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 21,048 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 700 అడుగులు కాగా, ప్రస్తుతానికి నీటి నిల్వ 691 అడుగులకు చేరుకుంది.
ఎగువ నుంచి ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగినా లేదా మరింత పెరిగినా, ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు స్పిల్వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జలాశయం దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

