కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల (Jagtial Heavy Rains) నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం, సంబంధిత అధికారులు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. వరద నీరు రహదారులపైకి చేరిన ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఐ సుధాకర్ ఆదేశించారు.
జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ.. వరద ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని సమీక్షించిన అధికారులు, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలు నిర్లక్ష్యంగా నీటిలోకి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. అవసరమైతే రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిని దాటే ప్రయత్నం చేయకూడదని, పిల్లలను నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు లేదా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, గ్రామస్థులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. జగిత్యాల రూరల్ ఎంపీడీఓ, ఎంపీవో, సంబంధిత మండల అధికారులు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

