కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రి (Banswada MCH Hospital) లో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనలో బాధ్యులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కాంట్రాక్టు అనస్థీషియా డాక్టర్ ను విధుల నుంచి తొలగించారు. ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 9, 10 తేదీల్లో బాన్సువాడ ఎంసీహెచ్ లో ఆపరేషన్ లు చేసుకున్న ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారు.
ప్రభుత్వం విచారణ కమిటీని వేసి విచారణ చేసింది. ఆపరేషన్ గదిలో ఆ రోజు వాడిన పరికరాలు, మందులు ఇతర వస్తువులను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించారు. విచారణ అనంతరం నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఆపరేషన్ చేసే సమయంలో విధులు నిర్వహించిన ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసినట్లు, మత్తు వైద్యుడిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ వెల్లడించారు.

