కలం, మెదక్ బ్యూరో : దుబ్బాక ప్రాంతం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున రైతుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులతో ఎమ్మెత్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy ) అన్నారు. పంటల సాగు, అత్యధునిక పద్దతులు, విద్యుత్ సరఫరా విషయాల్లో సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రైతు సమన్వయ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని సూచించారు.
అక్బరుపేట–భూంపల్లి మండలానికి చెందిన సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మండల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని పొలాలకు మోటార్ల ద్వారా నీరు అందుతున్నందున అక్కడ నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

