కలం, వెబ్ డెస్క్ : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) దేశంలో సృష్టించిన సునామీతో ఏకంగా కేంద్రమంత్రి రాజీనామా చేశారు. నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. సీజేపీ పోరాటంతో కేంద్రం దిగివచ్చి వారి డిమాండ్లను అంగీరించడంతో పెద్ద విజయం సాధించింది. ఈ క్రమంలో సీజేపీ స్పూర్తితో దేశంలో మరో పార్టీ పుట్టుకొచ్చింది అదే జనరల్ జనతా పార్టీ (General Janta Party). ఈ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టింది.
రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జనరల్ కేటగిరీ ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో జనరల్ జనతా పార్టీ (GJP) వ్యవస్థాపకులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. “Together We Rise, Divided We Fall” అనే నినాదంతో విడుదల చేసిన పోస్టులో, రిజర్వేషన్లను తొలగించేందుకు GJP చివరి సంస్థ అని, ఇకపై కొత్త సంస్థలు అవసరం లేదని స్పష్టం చేశారు.
జనరల్ కేటగిరీకి చెందిన వారంతా పార్టీలో చేరి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టుతో పాటు పార్టీ లోగోను కూడా విడుదల చేశారు. దేశంలో మరో పార్టీ తెరపైకి రావడంతో తీవ్ర చర్చ మొదలైంది. రిజర్వేషన్ విధానంపై మద్దతు, వ్యతిరేక వర్గాల మధ్య చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది. అయితే, కాక్రోచ్ జనతా పార్టీ లాగా జనరల్ జనతా పార్టీ విజయం సాధిస్తుందా..? దేశంలో ఈ పార్టీ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.

