కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (SRSP) బ్యాక్ వాటర్ ప్రాంతంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. మరొకరి ఆచూకీ గుర్తించాల్సి ఉండగా కోసం వెలుగు ఉన్నంత వరకూ గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. ఈ యువకుల్లో ముగ్గురు నిజామాబాద్ ఆటోనగర్ ప్రాంతానికి చెందిన వారు కాగా, ఒకరు హైదరాబాద్ హిమాయత్ నగర్కు చెందిన వారిగా గుర్తించారు. మృతులను అమాన్, ఖలీం, హజీమ్లుగా గుర్తించారు.
నలుగురు యువకులు సరదాగా గడుపుదామని ముప్కాల్ మండలంలోని లక్ష్మి హెడ్ రెగ్యులేటరీ పంపుహౌజ్ వద్దకు వెళ్లారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్స్ లోకి స్నానం కోసం దిగారు. ఒకరి తర్వాత ఒకరు గల్లంతయ్యారు. నలుగురు గల్లంతు అవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ముప్కాల్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్ మెండోరా ఎస్సై సుహాసినిలు పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
ముగ్గురి మృతదేహాలు వెలికితీయగా మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సాయంత్రం వెలుగు ఉన్నంత వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. పోలీసు కమిషనర్ సాయి చైతన్య కూడా సంఘటనా స్థలానికి చేరుకొని స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. దగ్గరుండి సహాయక చర్యలు పరిశీలించారు. తిరిగి సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఈ ఘటనతో నాలుగు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

