పాలమూరు వ‌ర్సిటీ వేదిక‌గా మిషన్ ఇండియా జాతీయ సదస్సు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు విశ్వవిద్యాలయం (Palamuru University) ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8వ‌ తేదీల్లో కణ్హా శాంతివనంలో ప్రతిష్ఠాత్మక “మిషన్ ఇండియా @2047” జాతీయ సదస్సు (Mission India 2047 National Conference) నిర్వహించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయ వేదికగా ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌డం మనందరి అదృష్టమని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌ల‌ర్‌ శ్రీనివాస్ తెలిపారు. శనివారం పరిపాలన భవనంలో సదస్సుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఈ జాతీయ సదస్సు నిర్వహణకు పోటీ పడినప్పటికీ, పాలమూరు విశ్వవిద్యాలయం ఈ అవకాశాన్ని దక్కించుకోవడం గర్వకారణమని తెలిపారు. భారతదేశాన్ని వికసిత్ భారత్–2047 లక్ష్యాల వైపు నడిపించే ఆలోచనలు, విధానాలు, పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ జాతీయ సదస్సు ఒక కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో PM-USHA పథకానికి చెందిన విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పారిశ్రామిక రంగ నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై తమ అనుభవాలను పంచుకోనున్నారని తెలిపారు.

సదస్సులో ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, ఉపాధి అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, జాతీయ పురోగతిలో విశ్వవిద్యాలయాల పాత్ర వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరుగుతాయని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల పురోగతి, ప్రాజెక్టుల రూపకల్పన, పరిశోధన నిధుల సమీకరణ, పరిశ్రమ–విశ్వవిద్యాలయ అనుసంధానంపై నిపుణులు విలువైన సూచనలు అందిస్తారని పేర్కొన్నారు.

విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులతో ప్రత్యక్షంగా చర్చించే అరుదైన అవకాశం ఈ సదస్సు ద్వారా లభిస్తుందని, తద్వారా వారి పరిశోధనా దృక్పథం మరింత విస్తృతమవుతుందని ఉపకులపతి అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివిధ పరిశ్రమలు, జాతీయ స్థాయి సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకొని ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్టార్టప్ అవకాశాలు మరియు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ జాతీయ సదస్సు పాలమూరు విశ్వవిద్యాలయ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంపొందించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పాలమూరు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, ఓఎస్‌డీ టు వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ డి.మధుసూదన్ రెడ్డి, జాతీయ సదస్సు కన్వీనర్ డా.కె.ప్రవీణ, కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ ఎం.నూర్జహాన్, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.శేకుంటి రవికుమార్, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్. ఎం.గాలన్న, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>