కలం, నిర్మల్: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PM Fasal Bima Yojana) పథకం తక్షణమే అమలు చేసి రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) ఆధ్వర్యంలో నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు పంట నష్టాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం దేశంలోని అత్యధిక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అమలు చేయకపోవడం వల్ల రైతులు బీమా రక్షణకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయడంతో పాటు ఖరీఫ్, రబీ పంటలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకు పథకం ప్రయోజనాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

