కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్కు తొలి పతకం అందించే అవకాశాన్ని అశోక్ మాలిక్ (Ashok Malik) తృటిలో కోల్పోయాడు. పురుషుల లైట్వెయిట్ పారా పవర్లిఫ్టింగ్ విభాగంలో అద్భుతంగా పోరాడిన ఆయన నాలుగో స్థానంతో పోటీని ముగించాడు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పారా పవర్లిఫ్టింగ్ పోటీలకు ఈ విభాగంతోనే శ్రీకారం చుట్టారు. ఇందులో అథ్లెట్లను ఎత్తిన బరువు ఆధారంగా కాకుండా, శరీర బరువును పరిగణనలోకి తీసుకునే పాయింట్ల విధానంతో ర్యాంకులు నిర్ణయించారు.
హర్యానాకు చెందిన అశోక్ మాలిక్ తన అత్యుత్తమ ప్రయత్నంలో 200 కిలోల బరువును విజయవంతంగా ఎత్తాడు. దీంతో ఆయనకు 143.8 పాయింట్లు లభించాయి. పోటీ మొత్తం పతకం కోసం గట్టి పోరాటం చేసినప్పటికీ చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మలేషియాకు చెందిన బోనీ బున్యావు గస్టిన్ 153.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ అయిన గస్టిన్, అశోక్ మాలిక్ (Ashok Malik) సవాల్ను విజయవంతంగా ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్కు చెందిన మార్క్ స్వాన్ 222 కిలోల అత్యుత్తమ లిఫ్ట్తో 153.9 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఇదే గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో తొలి స్వర్ణ పతకంగా నిలిచింది. నైజీరియాకు చెందిన రోలాండ్ ఎజురుయికే కూడా 153.9 పాయింట్లు సాధించాడు.
అయితే కౌంట్బ్యాక్ నిబంధన కారణంగా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆయన అత్యుత్తమ లిఫ్ట్ 185 కిలోలు. ఈ పోటీలో భారత్ తరఫున పాల్గొన్న మరో అథ్లెట్ పర్మ్జీత్ కుమార్ 135.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. అశోక్ మాలిక్ పురుషుల 65 కిలోల విభాగంలో పోటీ పడుతున్న అనుభవజ్ఞుడైన పారా పవర్లిఫ్టర్. ఆయన ఇప్పటికే పారాలింపిక్స్, ఆసియా పారా గేమ్స్, ప్రపంచ పారా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించారు.

