కలం, వెబ్డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత సీరియస్గా దృష్టి సారించిందని, వాటి నియంత్రణకు కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు యాజమాన్యాలను బాధ్యులను చేయాలని సూచించారు. క్యాంపస్ లోపల డ్రగ్స్కు సంబంధించిన ఎలాంటి ఘటన జరిగినా యాజమాన్యమే బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.
డ్రగ్స్ను గుర్తించడం, మాన్పించడం, శిక్షించడం అనే మూడు దశలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. విద్యాసంస్థల ఆవరణలో డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు టోల్ఫ్రీ నంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించాలన్నారు. పదేపదే పట్టుబడితే కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. డ్రగ్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

