కలం, వెబ్ డెస్క్: టీజీ ఎప్సెట్ (TGEAPCET-2026) ఇంజినీరింగ్ అడ్మిషన్ల రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ విడత కౌన్సెలింగ్లో మొత్తం 94,424 సీట్లు అందుబాటులో ఉండగా, 80,167 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 14,257 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కళాశాలలు కలిపి మొత్తం 84.9 శాతం సీట్లు భర్తీ అయినట్లు అడ్మిషన్ల కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఈ రెండో విడతలో 60,792 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, అందులో 7,897 మందికి తొలిసారిగా సీట్లు లభించాయి. అలాగే వెనుకబడిన (EWS) కోటా కింద 6,329 మంది విద్యార్థులు సీట్లు పొందారు.
సీటు పొందిన అభ్యర్థులు జులై 25వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జులై 24 నుంచి 28వ తేదీ మధ్యలో కేటాయించిన కళాశాలలో హాజరై, ఒరిజినల్ టీసీతో పాటు సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. గడువులోగా ఫీజు చెల్లించకపోయినా లేదా కళాశాలలో రిపోర్ట్ చేయకపోయినా సీటు ప్రాసెస్ ఆటోమేటిక్గా రద్దవుతుంది. రెండో విడతలో సీటు వచ్చి రిపోర్ట్ చేయని అభ్యర్థులు, తుది విడత కౌన్సెలింగ్కు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండదని కన్వీనర్ స్పష్టం చేశారు.
Read Also: రెండు చోట్లా ఓట్లు.. సీఎం రేవంత్ క్లారిటీ!
Follow Us On : WhatsApp

