కలం, నిర్మల్: నేటి తరం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధన అందించేందుకు ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న (DEO Bhojanna) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి మాట్లాడారు.
ఉపాధ్యాయులు బోధనలో కొత్త పద్ధతులు, మెలకువలను నేర్చుకొని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠాలు బోధించాలని సూచించారు. విద్యార్థులను కేవలం విద్యలోనే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ నరసయ్య, కోర్స్ డైరెక్టర్లు రామచందర్, శ్రీనివాసరెడ్డి, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.

