కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్చెరు (Patancheru) నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్, ఐలాపూర్, పటాన్ చెరువు ప్రాంతాలలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల కోసం కొనసాగుతున్న SIR ప్రక్రియ తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన SIR హెల్ప్ డెస్క్ లను సీఈఓ పరిశీలించి అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. SIR ప్రక్రియ జరుగుతున్న తీరును, ఇప్పటివరకు నమోదైన వివరాలను అడిగి తెలుసుకుని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సహాయం అందించాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. SIR ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగాలని అధికారులను ఆదేశించారు.

