కలం, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి ఎం.వెంకన్న (DTO Venkanna) మృతి చెందిన విషయం తెలిసిందే. చెల్పూర్లోని ఆర్టీవో కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.చంద్రశేఖర్ గౌడ్ను విచారణాధికారిగా నియమిస్తూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జీవో జారీ చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలతో వీలైనంత త్వరగా నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే అధికారుల భద్రత, వాహనాల తనిఖీలు, సీజ్ ప్రక్రియల్లో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాల్స్పై తగు సూచనలు ఇవ్వాలని కూడా సూచించారు.

