కలం, వెబ్ డెస్క్: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు (CI Nagaraju)కు మద్దతుగా పలువురు ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ (Vijayawada)లోని ఆయన ఇంటి వద్ద పలువురు ప్రజలు నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారు డిమాండ్ చేశారు. నాగరాజు సీఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే స్థానికంగా అసాంఘీక కార్యకలాపాలకు బ్రేక్ పడిందని వారు చెప్తున్నారు. వ్యవస్థ మారాలని, సిన్సియర్ ఆఫీసర్ నాగరాజు డిపార్ట్మెంట్లోనే ఉండాలని వారు నినాదాలు చేశారు.
మరోవైపు సీఐ నాగరాజు సింగ్ నగర్లోని కానిస్టేబుల్ ఇంట్లోనే తలదాచుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ ఆందోళన చేస్తున్న వారిలో జనసేన మద్దతుదారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాయికృష్ణ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే కులం అంటగట్టి తనను ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. నేరస్థులకు కులాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. దీంతో సీఐ నాగరాజుకు జనసేన నాయకులు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ సిట్ను నియమించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది.

