కలం, నల్లగొండ: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (Vijayawada highway)పై ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం సమీపంలో ఒక భారీ కంటైనర్ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రమాద తీవ్రతకు కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది కంటైనర్ను పక్కకు తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, భారీ వాహనం కావడం వల్ల దీనిని తొలగించే క్రమంలో ట్రాఫిక్ మరింతగా పెరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయం నుంచి రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చౌటుప్పల్, ధర్మోజిగూడ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ ఇప్పటికే రోడ్లు ఇరుకుగా మారాయి. ఈ ఇరుకు రోడ్ల గుండానే వాహనాలు వెళ్లాల్సి రావడం, దానికి తోడు ఈ కంటైనర్ ప్రమాదం తోడవడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ప్రస్తుతం వాహనాలు బంపర్ టూ బంపర్ అత్యంత నిదానంగా కదులుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని లేదా ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

