కలం, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన జీ7 (G7) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) చేసిన వ్యాఖ్యలు ఇటలీ రాజకీయ వర్గాల్లో వివాదానికి దారితీశాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) తనతో ఫోటో దిగేందుకు బ్రతిమిలాడారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఈ వ్యాఖ్యలు ఇటలీ ప్రధాని మెలోని మాత్రమే కాకుండా మొత్తం ఇటలీ దేశాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో జరగాల్సిన తన అధికారిక పర్యటనను కూడా తజానీ రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని జార్జియా మెలోని కూడా ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆమె, ట్రంప్ చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. ఒక మిత్రదేశానికి చెందిన నాయకురాలిపై ఇలాంటి అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ‘ఇటలీ దేశం గానీ.. నేను గానీ యాచించం’ అని మెలోని స్పష్టం చేశారు.
ఫ్రాన్స్లోని ఎవియాన్-లెస్-బైన్స్లో జరిగిన జీ7 సమావేశంలో ట్రంప్, మెలోని పలు సందర్భాల్లో మాట్లాడుకున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే, మెలోని తనతో ఫోటో కోసం వేడుకున్నారని ట్రంప్ చెప్పారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీ కొట్టిపడేసింది. ట్రంప్ గొప్పలు చెప్పుకోవడం, అమెరికాకు చిరకాల మిత్రదేశమైన ఇటలీకి విసుగు తెప్పించిందని పేర్కొంది.

