కలం, వెబ్ డెస్క్ : వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకాలకు వివాహిత కూతుర్లు అర్హులేనని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది. కారుణ్య నియామకాలకు కేవలం కుమారులు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ కారుణ్య నియామక నిబంధనల్లో ఉన్న ‘అవివాహిత’ అనే పదాన్ని తొలగించి, వివాహిత కుమార్తెలను కూడా చేర్చాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ మేరకు వైవాహిక స్థితి ఆధారంగా వివాహిత కుమార్తెల హక్కులను కాలరాయలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మరణిస్తే కారుణ్య నియామకానికి అర్హులేనని చెప్పింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితలకు ఊరట లభించినట్లైంది. లింగ సమానత్వం, మహిళా హక్కుల రక్షణలో తాజా తీర్పు ఓ మైలు రాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

