కలం, వెబ్ డెస్క్: చెస్ ప్రపంచంలో మరో కొత్త రారాజు పుట్టాడు. డచ్ ఆటగాడు అనీష్ గిరిని ఓడించి ఈ అర్హతను అందుకున్నాడు. అతడే ఉజ్బెకిస్తాన్కు చెందిన 20 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ జావోఖిర్ సిందారోవ్ (Sindarov). మంగళవారం ముగిసిన ఫిడే కాండిడేట్స్ టోర్నమెంట్ 2026 విజేతగా నిలిచారు. ఈ విజయంతో ఈ ఏడాది చివర్లో భారత స్టార్ ప్లేయర్ డి. గుకేష్తో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ పోరుకు ఆయన అర్హత సాధించారు. సిందారోవ్ ఒక రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ను ఖరారు చేసుకున్నారు. డచ్ ఆటగాడు అనీష్ గిరితో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకోవడం ద్వారా, ప్రత్యర్థుల కంటే రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. ఈ టోర్నమెంట్లో సిందారోవ్ ప్రదర్శనపై జర్మనీ నంబర్ వన్ ఆటగాడు విన్సెంట్ కీమర్ ప్రశంసలు కురిపించారు. సిందారోవ్ ఆట తీరు అద్భుతంగా ఉందని, ఆయన ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారని కీమర్ పేర్కొన్నారు.
సిందారోవ్ విజయ ప్రస్థానంలో తొలి రౌండ్ అత్యంత కీలకంగా మారింది. ఆండ్రీ ఎసిపెంకోతో జరిగిన ఆ మ్యాచ్లో ఒక దశలో సిందారోవ్ ఓడిపోయే స్థితిలో ఉన్నారు. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ, అనూహ్యంగా పుంజుకుని ఆ మ్యాచ్ను గెలవడం టోర్నమెంట్ గమనాన్నే మార్చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ గండం నుంచి గట్టెక్కిన తర్వాత, ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా 10వ రౌండ్లో భారత ఆటగాడు ప్రజ్ఞానందతో జరిగిన మ్యాచ్లో సిందారోవ్ చూపిన చొరవ అందరినీ ఆశ్చర్యపరిచింది. డ్రా చేసుకుంటే చాలు అనుకునే స్థితిలో కూడా ఆయన రిస్క్ తీసుకుని దాడికి దిగారని, అటువంటి ధైర్యం చేయడం వల్లే ఆయన ఈ స్థానంలో ఉన్నారని కీమర్ వివరించారు.

