కలం, నాగార్జునసాగర్: పెద్ద దేవులపల్లి రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ (Nagarjunasagar Left Canal) కు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ తాగునీటి సరఫరా ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది.
కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరివాహక ప్రాంత ప్రజలకు ఈ నీటి విడుదలతో తీవ్ర ఉపశమనం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 536.40 అడుగులుగా (పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు) నమోదు కాగా, నీటి నిల్వ 180.91 టీఎంసీలుగా ఉంది.
జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 21,241 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ఎస్ఎల్బీసీ ద్వారా 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, ప్రాజెక్ట్ క్రెస్ట్ గేట్లు మూసివేసి ఉండటంతో పాటు ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి కాలువ, లోయర్ లెవెల్ కెనాల్ ద్వారా నీటి విడుదల నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.

