కలం, మహబూబ్నగర్ బ్యూరో : శుక్రవారం ఒక రోజు బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పనిని అమలు పరచాలని, వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
బ్యాంకుల ప్రైవేటీకరణను ఆపాలని, కార్పొరేట్లు తీసుకున్న అప్పులు మొత్తం తిరిగి చెల్లించాలని కోరారు. కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం సుభాష్ చంద్ర జీ గ్రూప్ తీసుకున్న మొత్తం రుణ బకాయి డబ్బులు వెంటనే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించాలని, బ్యాంకు ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు అవసరమైన ఖాతాలను తెరవడానికి అదనపు సిబ్బందిని నియమించాలని, ప్రభుత్వ బ్యాంకులే ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాయని, బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒకరోజు నిరవధిక సమ్మెకు సీఐటీయూ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కురుమూర్తి తెలిపారు .

